15-04-2025 11:33:28 PM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
హైదరాబాద్ (విజయక్రాంతి): కేసీఆర్పై కక్షతో తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెంటు, నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని రైతులు చెప్పకపోతే ముక్కు నేలకు రాస్తామని సవాల్ చేశారు. మంత్రులు మా వెంట వస్తే ఎండిన పంటపొలాలను చూపిస్తామన్నారు.
రాష్ట్రంలో పంటలు ఎండిపోవడంతో పాటు అకాల వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫోస్టోలో రైతుల గురించి చెప్పిన హామీలేవి వాస్తవ రూపం దాల్చలేదన్నారు. భూభారతిలో అసైన్మెంట్, పోడు భూముల క్రయవిక్రయాలపై చట్టం తెస్తామని చెప్పి ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ప్రశ్నించారు. అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయిన రేవంత్ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. అకాల వర్షాలతో కష్టాల పాలైన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజల అభిప్రాయం చెప్పారని, తాము కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లుండాలని కోరుకుంటున్నట్టు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.