కొండపాక, సెప్టెంబర్ 11: కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా తొగుట మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కాన్గల్ గ్రామానికి చెందిన దొమ్మట స్వామి (32) గత ఐదేళ్లుగా మూడెకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సాగు పెట్టుబడి కోసం పలువురి వద్ద అప్పులు చేశాడు. కాగా, పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక జీవితంపై విరక్తి చెంది బుధవారం తాను కౌలు చేస్తున్న పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.