calender_icon.png 23 October, 2024 | 3:08 AM

రైతన్న శ్రమ వానపాలు..!

23-10-2024 12:55:05 AM

  1. అకాల వర్షంతో తడిసిన ధాన్యం
  2. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
  3. ఖమ్మం జిల్లాలో తండ్రీకూతురు మృతి

ఖమ్మం/నిర్మల్/కామారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాలో మంగళవారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్లపై ఆరబోసిన వరిధాన్యం, మొక్కజొన్నతడిసి మద్దయ్యాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డులో 100 మంది రైతుల ధాన్యం తడిసింది. 

పిడుగుపాటుకు తండ్రీకూతురు మృతి 

ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో చింతల లింగస్వామి (58), ఆయన కూతురు కావేరి (18) తమ పత్తి చేలో కలుపు తీస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యం లో పిడుగుపడి అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. కావేరి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది.

దసరా సెలవులకు ఇంటికి వచ్చి తండ్రికి తోడుగా చేనుకు వెళ్లగా ఈ విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామం లో మంద వెంకటి(25) అతని తండ్రి మంద నాగభూషణం ఇద్దరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కే్రందాల వద్ద ధాన్యాన్ని ఆరబెడుతున్నారు.

ఒకేసారి బార్షీ వర్షం రావడంతో చెట్టుకిందికి వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో మంద వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తండ్రి నాగభూషణంకు తీవ్ర గాయాలయ్యాయి.