జక్రాన్ పల్లి: ధరణి పోర్టల్ ఆ యువ రైతు ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ లో శుక్రవారం చోటుచేసుకుంది. ధరణిలో భూమి నమోదు కాలేదని మనస్థాపంతో యువ రైతు రాజేష్ ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు రాజేశ్ వ్యవసాయంతో పాటు వ్యాపారంలో రూ. 12 లక్షలు నష్టపోయాడు. తనకున్న 2 ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాలని ప్రయత్నించాడు. కానీ ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న జక్రాన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. రాజేశ్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.