17-02-2025 07:32:29 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్చి 5 వరకు జరిగే కంటి పరీక్షలలో విద్యార్థులందరినీ పరీక్షించడం జరుగుతుందన్నారు. ఇందుకు జిల్లాలోని ఎనిమిది ఆర్ బి ఎస్ కే అంబులెన్స్ ల ద్వారా రోజుకు 80 నుంచి 100 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 2024లో మన జిల్లాలో మొదటి పేజ్ లో 577 మంది, రెండవ ఫేజ్ లో 697 మంది విద్యార్థులను గుర్తించామన్నారు.
అప్పుడు 164 రెసిడెన్షియల్ పాఠశాలల్లో, 568 ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు చేశామని, ఇందులో వైద్య సిబ్బంది, కంటి నిపుణుల ద్వారా నిర్ణయించిన 1,274 మందికి తిరిగి పరీక్షలు చేసి కళ్ళ అద్దాలు ఇవ్వడానికి ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం 86 మందికి పరీక్షలు చేసి అద్దాల కోసము పంపించడం జరిగిందని, ఇద్దరినీ శస్త్ర చికిత్సల కొరకు రెఫర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్ర రెడ్డి, జిల్లా కంటి అధికారి డాక్టర్ యశ్వంతరావు, నోడల్ ఆఫీసర్, ఉపవైద్యాధికారి డాక్టర్ ఎస్ అనిత, ఆర్ఎంఓ డాక్టర్ భీష్మ, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శిల్ప, డాక్టర్ చంద్రబాబు, ఆప్తమాలిక్ శంకర్, భాస్కర్ రెడ్డి, డెమో వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.