08-04-2025 06:14:26 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): ఇంగ్లిష్, గణితంలో కనీస సామర్థ్యాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఉద్దీపకం వర్క్బుక్స్, వేదిక్ మ్యాథ్స్ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంలోని ఏ కాలనీ తండాలో ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలను సందర్శించిన ఆయన ఉద్దీపకం వర్క్బుక్స్, వేదిక్ మ్యాథ్స్కు సంబంధించి పాఠ్యాంశాలను విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారనే విషయాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు.
విద్యార్థులతో బోర్డుపై రాయించి ఒక్కో విద్యార్థిని లేపి ప్రగతిని పరిశీలించారు. 1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఇంగ్లిష్ చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో వెనుకబడి పోతున్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇల్లందు గిరిజన సంక్షేమ సహాయ అధికారులు సూర్ణపాక రాధమ్మ, హెచ్ఎం బానోత్ అమర్ సింగ్, ఉపాధ్యాయులు ఎల్ విజయ పాల్గొన్నారు.