calender_icon.png 24 October, 2024 | 5:54 AM

ఖరీదైన కన్‌స్ట్రక్షన్

14-07-2024 12:05:00 AM

  • పెరిగిన కార్మికుల రోజు కూలీ

గడిచిన మూడు ఏండ్లలో 35 శాతం పెరిగిన నిర్మాణ వ్యయం

18 శాతం పెరిగిన సిమెంట్ ధర

47 శాతం పెరిగిన స్టీల్ ధర

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 13 (విజయక్రాంతి): దేశంలో ఓ వైపు పట్టణీకరణ విస్తరిస్తుండటం, మరోవైపు వనరులు అంతరిస్తుండటంతో భవన నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. భవన నిర్మాణ కూలీల నుంచి మొదలు స్టీల్, సిమెంట్, అల్యూమినియం, కాపర్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల్లో నిర్మాణ వ్యయం సుమారు 35 శాతం పెరగడంతో, ఈ ధరల ప్రభావం బిల్డర్లు నిర్మిస్తున్న ఇండ్లపై చూపుతోంది.

తద్వారా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇల్లు కొనుక్కొనే అవకాశాలు తగ్గిపోతున్నాయి. పట్టణాల్లో భూముల విలువకు తోడు నిర్మాణ వ్యయం పెరుగుతోంది. అలాగే ఇంధన ధరల పెరుగుదల కూడా పరోక్షంగా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతోందని ఇటీవల జేఎల్‌ఎల్ సంస్థ వెల్లడించిన నివేదిక పేర్కొంది. సాధారణంగా సిమెంట్, స్టీల్, కాంక్రీట్, ఇసుక, ఇటుకల వంటి నిర్మాణ సామగ్రి తయారీ ప్రాంతం నుంచి నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతుంది. గడిచిన మూడేండ్లలో డీజిల్ ధర 32 శాతం మేర పెరిగింది. దీంతో నిర్మాణ సామగ్రి రవాణా ఖర్చులు పెరిగి, ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతోంది. ఈ ధరల పెరుగుదల క్రమంగా ఇళ్ల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పెరిగిన కార్మికుల కూలీ

హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్ను, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో నైపుణ్యం కలిగిన నిర్మాణ కూలీలకు ఇచ్చే రోజువారీ సగటు కూలీ రూ.1,200. నైపుణ్యం లేనివారికి రూ.900 ఇస్తున్నారు. ఇక కీలకమైన స్టీల్, సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగాయి. నిర్మాణంలో కీలకమైన సిమెంట్ ధరలు మూడేండ్లలో 18 శాతం పెరిగాయి. ఒక దశలో పెరుగుదల గరిష్ఠంగా 39 శాతం వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఏడాది చివరిలో కొంతమేర ధరలు తగ్గడంతో నిర్మాణం రంగం ఊపిరిపీల్చుకుంది. 53 గ్రేడ్ సిమెంట్ టన్నుకు 2020 సంవత్సరం ప్రారంభంలో ధర రూ.5,120 ఉంటే 2021 నాటికి రూ.7,100 చేరి, 2022 ఆఖరుకు రూ.5,960కి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో 50 కిలోల సిమెంట్ బస్తా కంపెనీని బట్టి రూ.270 నుంచి రూ.410 వరకు ధరలు ఉన్నాయి.

భారీగా పెరిగిన ధరలు

స్టీల్ ధరలు మూడేండ్లలో భారీగా పెరిగాయి. మూడేండ్ల క్రితం టన్ను రూ.42,480 ఉన్న రీఇన్‌ఫోర్స్‌మెంట్ స్టీల్ ఏకంగా 43 శాతం పెరిగి గత ఏడాది ఆఖరు నాటికి రూ.60 వేల వరకు చేరింది. ప్రస్తుతం మార్కెట్‌లో కంపెనీని బట్టి టన్ను స్టీల్ రూ.62 వేల నుంచి రూ.72 వేల వరకు ధరలున్నాయి. హైరైజ్ అపార్ట్‌మెంట్స్ ట్రెండ్ వచ్చాక, కాంక్రీట్ వినియోగం బాగా పెరిగింది. ఎం25, ఎం30, ఎం35 గ్రేడ్ రకం కాంక్రీట్ ధరలు 2020 సంవత్సరంలో ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.5,012 ఉండేది. ప్రస్తుతం కాంక్రీట్ ఒక క్యూబిక్ మీటర్ రూ.5,650 చేరింది.

పెద్దపెద్ద నిర్మాణాల్లో అల్యూమినియం, కాపర్ వినియోగం కూడా ఎక్కువే. భవన నిర్మాణంలో ఎలక్ట్రికల్‌లో వస్తువులు చాలా కీలకం. మార్కెట్‌లో ప్రస్తుతం వీటి ధరలు భారీగా పెరిగాయి. అల్యూమినియం ధరలు 2020 సంవత్సరంతో పోలిస్తే 2023 ఆఖరునాటికి 46 శాతం పెరిగాయి. ఇప్పుడు టన్ను అల్యూమినియం రూ.1.86 లక్షలుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్ల నుంచి మొదలు ఆకాశాన్నంటే హైరైజ్ అపార్ట్‌మెంట్స్ వరకు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యాల భవనాలను 30 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మిస్తున్నట్లయితే నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.5,300 నుంచి రూ.6,300 వరకు అవుతోందని నిపుణులు చెప్తున్నారు. నాణ్యంగా, ప్రీమియంగా కట్టే ప్రాజెక్టుల్లో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.

పెరుగుతున్న నిర్మాణ వ్యయం

పదిహేను అంతస్తులపైన కట్టేవాటిలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.3,800 నుంచి రూ.4,500 అవుతోంది. 5 నుంచి 12 అంతస్తులలోపు కట్టే భవనాల్లో చదరపు అడుగుకు రూ.2,900 నుంచి రూ.3,300 వ్యయం అవుతోంది. అందుబాటు ఇళ్ల నిర్మాణంలో స్టాండ్ లోన్ అపార్ట్‌మెంట్లు ఐదు అంతస్తుల వరకు ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి సగటున రూ.2,200 నుంచి రూ.2,600 ఖర్చు అవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఇక విల్లాల్లో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల వరకు చదరపు అడుగుకు రూ.4,300 నుంచి ప్రాజెక్టును బట్టి రూ.12 వేల వ్యయం అవుతోంది. వాణిజ్య ఆకాశహర్మ్యాల నిర్మాణ వ్యయం గృహ నిర్మాణంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటికి చదరపు అడుగు రూ.4,100 నుంచి రూ.4,800 వరకు ఖర్చవుతోంది.