24-02-2025 08:39:29 PM
బిల్లా వంశీ కుటుంబానికి ఆర్థిక సహాయం...
మందమర్రి (విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సరం సెప్టెంబర్లో విద్యుత్ షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి పట్టణంలోని అల్ఫోన్సా పాఠశాల పూర్వ విద్యార్థులు భారీ ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు. రామకృష్ణాపూర్ కు చెందిన బిల్లా వంశీ, సెప్టెంబర్ 15, 2024న విద్యుత్ షాక్ తో దురదృష్టవశాత్తు మృతి చెందాడు. ఆల్ఫోన్సా పాఠశాల 2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆయన కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చి విరాళాలు సేకరించగా, సేకరించిన 7 లక్షల విరాళాలను పోస్ట్ ఆఫీస్ బాండ్ ద్వారా సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబానికి అందచేశారు.
వంశీ అకాల మరణంతో చలించిపోయిన బాల్య మిత్రులు, నిధుల సేకరణ చేపట్టి బాల్య మిత్రుని పిల్లల భవిష్యత్తు కోసం రూ.7 లక్షలు సేకరించారు. ఈ మొత్తం పోస్టాఫీసులో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్ సి) పథకంలో డిపాజిట్ చేసి ఆ పత్రాన్ని వంశీ భార్య స్రవంతికి అందజేశారు. ఇది భవిష్యత్తులో ఆయన కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించనుంది. ఈ సందర్భంగా ఆల్ఫోన్సా పాఠశాల పూర్వ విద్యార్థుల పలువురు అభినందించారు. భారీ మొత్తంలో విరాళాలు సేకరించిన తీరు పట్ల స్నేహితుల మధ్య ఉన్న అనుబంధాన్ని కొనియాడారు.