08-03-2025 12:39:50 AM
నాగర్కర్నూల్, మర్చి 7 (విజయక్రాంతి): ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆనవాళ్ల కోసం కేరళ ప్రభుత్వం రెండు ప్రత్యేక జాగిలాలను పంపింది. ఎన్జీఆర్ఐ నిపుణులు జీపీఆర్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లోనే శుక్రవారం ఆ జాగిలాలు కూడా అక్కడే గుర్తించాయి. వాటితోపాటు మరో ఎనిమిది చోట్ల కార్మికుల ఆనవాళ్లు ఉన్నట్లు అనుమానిస్తూ మార్కింగ్ చేశారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో టన్నెల్లోకి వెళ్లిన జాగిలాలు 13 కిలోమీటర్ల నుంచి ఘటనస్థలికి సుమారు 0.1 మీటర్ల దూరానిక చేరుకున్నాయి. కానీ టీబీఎం కటింగ్ కోసం వాడుతున్న గ్యాస్ ఇతర వాయువుల కారణంగా జాగిలాలు ఘటనస్థలిలో ఎక్కువసేపు ఉండలేకపోయాయి. జీపీఆర్ రాడార్ ద్వారా గుర్తించిన ఎనిమిది ప్రదేశాల్లో ఎన్జీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ నేవీ ఉత్తరాఖండ్ ర్యాట్ హోల్ మైనర్ వంటి రెస్క్యూటీమ్ సైతం తవ్వకాలు జరిపా యి.
కానీ ఆ ప్రదేశంలో నీటి ఊట, బురదతో పాటు సిమెంట్ పదార్థాలు కారణంగా ఆ ప్రదేశం గట్టిగా మారడంతో తవ్వకాల్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కార్మికుల ఆనవాళ్లను గుర్తించలేకపోయిన ట్లు తెలుస్తోంది. మరోపక్క కన్వేయర్ బెల్ట్ కూడా మొరాయిస్తుండటంతో ప్రస్తుతం టన్నెల్లోని బురద మట్టి, ఇతర యంత్రాల శకలాలను బయటకు తరలించేందుకు ఇబ్బందులు నెలకొన్నాయి.
మరోపక్క టన్నెల్లో భారీగా నీటి ఊట, బురద పేరుకుపో తుండటంతో తవ్వకాలు జరిపితే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రా ణ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ రోబో యంత్రాలను సహాయక చర్యలకు ఉపయోగించునుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం అన్వి రోబో టెక్ నిపుణుల బృందం అక్కడి రెస్క్యూ బృందాలతో పాటు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించాయి. అనంతరం శుక్రవారం రాత్రి సమీక్ష సమావేశం అనంతరం ప్రభుత్వానికి రోబో యంత్రాల వినియోగం సాధ్యాసాధ్యాలపై నివేదించనున్నారు.