calender_icon.png 23 October, 2024 | 4:51 AM

బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ బర్త్‌డే పార్టీలో ఎక్సైజ్ దాడులు

31-07-2024 09:50:53 PM

రిసార్ట్‌లో వేడుకలకు బుల్లితెర నటులు హాజరైనట్లు గుర్తింపు

అనుమతి లేకుండా మద్యం వినియోగంపై ఇద్దరిపై కేసు

హైదరాబాద్: ఘట్‌కేసర్ అంకుషాపూర్‌లోని ది కాంటినెంటల్ రిసార్ట్‌లో బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ బర్త్‌డే పార్టీలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ అధికారులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తన బర్త్‌డే సందర్భంగా ది కాంటినెంటల్ రిసార్ట్‌లో ఈ నెల 29న మహబూబ్ షేక్ వేడుకలను నిర్వహించాడు. ఈ వేడుకలకు 20మందికి పైగా బుల్లితెర నటులు, ప్రముఖులు హాజరయ్యారు.

అయితే వేడుకల్లో మద్యం వినియోగించుకోవడం కోసం నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఈ విషయం తెలిసి ఎక్సైజ్ పోలీసులు రిసార్ట్‌పై దాడులు నిర్వహించి అనుమతి లేకుండా వినియోగిస్తున్న 10లీటర్ల మద్యాన్ని, 5లీటర్ల బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బర్త్‌డే పార్టీ నిర్వాహకుడు షేక్ సుభానీ, రిసార్ట్ యజమాని సుధీర్‌పై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

పార్టీలు నిర్వహించుకోవడానికి ఎక్సైజ్ శాఖ అనుమతులు తీసుకోవాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి కమలాసన్‌రెడ్డి తెలిపారు. నిత్యం ఎక్సైజ్ పోలీసులు, ప్రత్యేక బృందాలు అనుమతి లేని వేడుకలపై నిఘా ఉంచుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ అనుమతించిన మద్యాన్ని మాత్రమే వినియోగించాలని, పార్టీలలో ఎలాంటి డ్రగ్స్‌ను వినియోగించరాదని తెలిపారు.