21-03-2025 01:12:30 AM
జగిత్యాల అర్బన్, మార్చి 20 (విజయక్రాంతి): శుక్రవారం నుండి ప్రారంభం కాబోయే పదవ తరగతి పరీక్షలకు అంతా సిద్ధం చేశామని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. జగిత్యాల జిల్లాలో 2024- 25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలు ఈనెల 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయని తెలిపారు.
పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏ, బి , సి కేటగిరిలుగా విభజించడం జరిగిందని,( ఏ) కేటగిరిలో 25 (బి) కేటగిరిలో 20 (సి )కేటగిరిలో 22 కేంద్రాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో 65 కేంద్రాలను రెగ్యులర్ విద్యార్థులకు మిగిలిన 2 కేంద్రాలు రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు కేటాయించడం జరిగిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి మొత్తం 337 పాఠశాలల్లో 11,855 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు . పరీక్షల నిర్వహణకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు 67 మంది డిపార్ట్మెంటల్ అధికారులు 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 28 వెహికల్ ఇన్చార్జులు, 826 మంది ఇన్విజిలేటర్స్ ను నియమించడం జరిగిందని తెలిపారు.
పరీక్షలన్ని ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9:30 నుండి 11 వరకు జరుగుతాయని ఈ సందర్భంగా వివరించారు. సంబంధిత నియమాలన్నీ సిఎస్ లకు, డివోలకు శిక్షణ ఇచ్చి తగిన విధంగా వ్యవహరించాలని ఆదేశించామని డిఈఓ కే.రాము, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గంగాధర్ తెలిపారు.