26-02-2025 07:44:03 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): ఈనెల 27న నిర్వహించనున్న మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బెల్లంపల్లి నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 16 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఓటింగ్ కోసం 9 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయుల ఓటింగ్ కోసం ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 5289 మంది పట్టభద్రులు, 235 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో దాదాపు 60 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు.