మాజీ మంత్రి హరీశ్రావు విమర్శ
మెదక్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): అబద్ధాల పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భవిష్యత్లో ప్రజలు సాగనంపటం పక్కా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మెదక్లో పలువురు బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు పలు గణేశ్ మండపాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగంలో అన్నీ అబద్ధాలే కన్పిస్తున్నాయన్నారు.
రాష్ట్ర అప్పుల గురించి ప్రచార సభల్లో, ప్రభుత్వ వేదికలపై చివరకు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కూడా అబద్దాలు మాట్లాడటం శోచనీయమన్నారు. కాలయాపన చేయకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, నాయకులు దేవేందర్రెడ్డి, జగపతి, మల్లికార్జున్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.