28-03-2025 01:08:21 AM
హైదరాబాద్, మార్చి 27(విజయక్రాంతి): తెలంగాణలో రుణమాఫీ అమలు అంశంపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలిపారు. “నిర్మలా సీతారామన్ ఆర్థిక విధానాలతో తనకు చాలా విభేదాలు ఉండొచ్చు కానీ, ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నా..”అని అందులో పేర్కొన్నారు. తెలంగాణలో 30శాతం కూడా రైతు రుణమాఫీ కాలేదని ఆరోపించారు.
రాష్ట్రంలోని బీజేపీ నేతలు సీఎం రేవంత్రెడ్డికి వ్యక్తిగత సిబ్బందిగా ఉండటంలో బిజీగా ఉన్నారని, రైతుల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడరని విమర్శించారు. అలాగే, తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. తమపై మాటల దాడి చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, రైతుబంధు విడుదల కావడం లేదని, తీవ్రమైన నీటి సంక్షోభం ఉన్నదని, రైతాంగం గత దశాబ్దంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ వివరించారు.
ఇంతకీ నిర్మల ఏమన్నారంటే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు రైతులందరికీ రుణమాఫీ కాలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సగం మందికి రుణమాఫీ చేసి అందరికీ చేశామని కాంగ్రెస్ చెబుతోందని ఆరోపించారు. రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని వివ రించారు. కొందరు రైతులకు వన్టైమ్ సెటిల్మెంట్ కింద బ్యాంకులు రుణమాఫీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీని ద్వా రా రైతులు మరోసారి రుణం తీసుకునేందు కు అర్హత కోల్పోవాల్సి వస్తోందని చెప్పారు.