19-03-2025 01:41:25 AM
సీఎం రేవంత్ పై మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఫైర్
హుస్నాబాద్, మార్చి 18 : నీదాకా వస్తేగానీ నొప్పి తెలవలేదా? రాజకీయాల్లో విలువలు ఇప్పుడు గుర్తొచ్చాయా?’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వొడితల సతీశ్ కుమార్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాకు పంపిన ప్రకటనలో సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ప్రజాక్షే త్రంలో ఉన్నవారిపై రాజకీయ విమర్శలు సబబే. అవసరమైతే విధానాలను ఎండగట్టడమూ సమంజసమే. కానీ వ్యక్తిగత దూషణలు, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులను ఈ రొంపిలోకి లాగి నీచ ప్రచారానికి దిగడం దుర్మార్గం.’ అని దుయ్యబట్టారు. ఎప్పటినుంచి, ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఈ విష క్రీడ మొదలైందో అందరికీ తెలుసన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను నోటికొచ్చినట్టు దూషించింది, బూతు భాషకు తందానా అంటూ దరువేసింది రేవంత్ కాదా అన్నారు. పదేండ్ల పాటు సాగిన ఈవికృత ప్రచారం, ఇప్పుడు వెర్రితలలు వేస్తుండడంతో దానిపై చిందులేస్తున్నదెవరరో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు.
ప్రజాక్షేత్రంలో ఉన్నవారిని వ్యక్తిగతంగా, వారి కుటుంబ సభ్యులను దూషించడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వారి నుంచి వచ్చే పదజాలం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనే అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు.