సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట, ఆగస్టు 9: రాష్ట్రంలో ఒక్క ఎకరా ఎండినా రాష్ట్రప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఏ ఒక్క మంత్రికీ చిత్తశుద్ధి లేదన్నారు. జల్సాల కోసమే మంత్రులు పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. హామీలు నెరవేర్చలేకే రాష్ట్రప్రభుత్వం సబ్ కమిటీల పేరిట కాలయాపసన చేస్తున్నదన్నారు.
ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే కాళేశ్వరం నుంచి పంపింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సుంకిశాల పథకం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టు అని, పథకంలోని రెటెయినింగ్ వాల్ కూలితే, సంబంధిత నిర్మాణ సంస్థే బాధ్యత తీసుకుంటుందన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, బీఆర్ఎస్ నేత వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.