03-03-2025 07:37:33 PM
డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు వినతిపత్రం అందజేసిన బిఆర్ఎస్ నేతలు...
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): మణికొండలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని డిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నత అధికారులకు వినతిపత్రం అందజేశారు. సుదూర ప్రాంతాల్లో ఫైర్ స్టేషన్ లు ఉండటంతో ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అదేవిధంగా ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మణికొండ మునిసిపాలిటీలో దాదాపు 2 లక్షల జనాభా ఉందని, అయితే నిబంధనల ప్రకారం సుమారు 50 వేల జనాభా ఉంటే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు.
నార్సింగ్ మున్సిపాలిటీలో కూడా జనాభా పెరిగిపోవడంతో పరిస్థితి ఇబ్బందిగా ఉందన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సత్వరమే స్పందించి కొండ మున్సిపాలిటీలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాణిజ్య సముదాయాలు కూడా భారీగా ఉండటంతో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సీతారాం ధూళిపాళ్ల, వర్కింగ్ ప్రెసిడెంట్ ధనరాజ్, జనరల్ సెక్రటరీ నరేందర్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.