ఫార్మసీ సీట్లకు తగ్గిన డిమాండ్
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): తెలంగాణ ఈసెట్ తుది దశ కౌన్సిలింగ్ పూర్తయింది. చివరి ఫేజ్ కౌన్సిలింగ్ కోసం 14,212 మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోగా.. వీరిలో 9,646 మందికి సీట్లు కేటాయించారు. తుది విడత కౌన్సిలింగ్ కోసం ఇంజనీరింగ్లో 12,785, ఫార్మసీలో 1,180 సీట్లు (మొత్తం 13,965సీట్లు) ఉండగా... ఇంజనీరింగ్లో 2,378, ఫార్మసీలో 1,133 (మొత్తం 3511 సీట్లు) భర్తీ కాలేదు. ఇంజనీరింగ్లో 81.40శాతం సీట్లు భర్తీ కాగా... ఫార్మసీలో కేవలం 3.98 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఫార్మసీలో 1,180 సీట్లకు గాను 47 సీట్లు మాత్రమే భర్తీ కాగా... 1,133 సీట్లు మిగిలిపోయాయి. బీ ఫార్మసీ కోర్సుకు విద్యా ర్థుల నుంచి ఆసక్తి కనిపించలేదు. కంప్యూటర్ సైన్స్ సీట్లు 72 శాతం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సీట్లు 98 శాతం, సివిల్, మెకానికల్ సీట్లు 98. 78 శాతం, ఇతర ఇంజనీరింగ్ కోర్సు ల సీట్లు 81 శాతం భర్తీ అయ్యాయి. కౌన్సిలింగ్లో సీట్లు కేటాయించబడిన విద్యార్థులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారి సీట్లు రద్దవుతాయి.