20-03-2025 11:44:54 PM
రియాద్లోని అపార్ట్మెంట్లో విగత జీవిగా గుర్తింపు..
ప్రధాని మోదీ ‘ప్రాజెక్ట్ చీతా’లో క్రియాశీల పాత్ర..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు ‘ప్రాజెక్టు చీతా’లో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు విన్సెంట్ వాన్ డెర్ మార్వే అనుమానాస్పద రీతిలో మరణించారు. సౌదీ అరేబియా రియాద్లోని ఓ అపార్ట్మెంట్లో హాల్లో విగతజీవిగా రక్తపు మడుగులో పడి కనిపించారు. విన్సెంట్ తలకు గాయం కావడంతోనే మరణించినట్టు అక్కడి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది.
అయితే విన్సెంట్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రధాని మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా గతంలో ‘పాజెక్టు చీతా’ను చేపట్టి అంతరించిపోతున్న చీతాలను భారత్లో ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తెప్పించి, మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో వదిలారు. ఈ మొత్తం ప్రాజెక్టులో విన్సెంట్ కీలకంగా వ్యవహరించారు.