పవన్ కళ్యాణ్ -సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ మూవీలో పవన్ గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్ కాగా, ‘సలార్’ భామ శ్రియారెడ్డి, తమిళ్ స్టార్ అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు చిత్రీకరణను పునఃప్రారంభించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. పవన్ కళ్యాణ్ నవంబర్ రెండో వారంలో షూటింగ్లో జాయిన్ కానున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించి అభిమానులను ఖుషీ చేసే తాజా వార్త ఒకటి బయటికొచ్చింది. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ ‘ఓజీ’ మూవీతో ఎంట్రీ ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో పవన్ చిన్నప్పటి క్యారెక్టర్లో అకీరా కనిపించబోతున్నాడని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం అకీరా మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు చెందిన స్టిల్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసమే అకీరా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడని చెప్పుకొంటున్నారు. ఇదే నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ఖుషీ పక్కా. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.