calender_icon.png 22 October, 2024 | 12:58 PM

జర్నలిస్టుల హెల్త్‌స్కీం సరిగ్గా అమలయ్యేలా చూడండి

22-10-2024 03:16:02 AM

మంత్రి దామోదరకు ఐజేయూ నేతల వినతి

రంగారెడ్డి, అక్టోబర్21 (విజయక్రాంతి): గత ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో జర్నలిస్టులకు హెల్త్ స్కీం సరిగా అమలు కావడంలేదని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరాసత్ ఆలీ తెలియజేశారు.

సోమవారం సంఘం ప్రతినిధుల బృందం కల్కూరి రాములు, వరకాల యాదగిరి, కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి, మోతే వెంకట్‌రెడ్డి, రాజేష్, శివశంకర్ గౌడ్‌తో కిసి మంత్రితో పాటు హెల్త్ కమిషనర్  ఆర్.వి.కర్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మెజార్టీ కార్పొరేట్ దవాఖానాల్లో జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్‌కార్డులు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు అప్పలు చేసి చికిత్స పొందుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు విషయంలో త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ప్రతినిధులు తెలిపారు.