23-03-2025 12:27:39 AM
మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఎల్2ఈ: ఎంపురాన్’. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మోహన్లాల్ మాట్లాడుతూ.. “47 ఏళ్ల నా సినీ ప్రయాణంలో తెలుగు చిత్రసీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించే అదృష్టం నాకు కలిగింది.
తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ ఇంకెక్కడా దొరకదు. ఇండియాలోనే టాలీవుడ్ ది బెస్ట్ ఇండస్ట్రీగా ఉంది. కేరళలో మేం అన్ని భాషల చిత్రాలను చూస్తాం. ఇప్పుడు మా సినిమాల్ని కూడా అన్ని భాషల వాళ్లు చూస్తున్నారు. ఇప్పుడు మేం పాన్ ఇండియా వైడ్గా చిత్రాలను చేస్తున్నాం. పృథ్వీరాజ్ ఈ చిత్రంతో తెరపై అద్భుతం చేశారు. మేం ముందుగా లూసిఫర్ను మూడు పార్టులుగా తీయాలని అనుకున్నాం.
ఎంపురాన్ బ్లాక్ బస్టర్ అయితే.. మూడో పార్ట్తో మళ్లీ వస్తాం” అన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ .. “తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చాలా అథంటిక్గా ఉండాలని ప్రయత్నించాం. తెలుగు ప్రేక్షకులు తెలుగు వర్షెన్లో చూస్తే.. ఒరిజినల్ సినిమానే అనుకుంటారు. లూసిఫర్ సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయలేదు. కానీ అన్ని భాషల్లోకి ఆ చిత్రం రీచ్ అయింది.
అందుకే ఇప్పుడు దీన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. నా దృష్టిలో మంచి సినిమా చెడ్డ సినిమా అనేది మాత్రమే ఉంటుంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. నేను మంచి సినిమాను తీశానని నమ్ముతున్నాను. ఈ మూవీ కోసం మోహన్లాల్ గారు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశాం” అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
మాలీవుడ్లో అత్యధిక బడ్జెట్తో తీసిన ఈ సీక్వెల్ ఏ రేంజ్లో ఉందో టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. స్క్రీన్ మీద మోహన్ లాల్ కనిపిస్తే వావ్ అనిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమార్ గారు పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతోన్నారు” అన్నారు. మాస్టర్ కార్తికేయ మాట్లాడుతూ .. “ఎంపురాన్ నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. ఇంత పెద్ద చిత్రంలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉంది. సలార్ తర్వాత ఇంత పెద్ద ఆఫర్ వస్తుందని ఊహించలేదు” అన్నాడు.