calender_icon.png 22 October, 2024 | 6:56 PM

పంట ఉత్పత్తుల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలి

22-10-2024 05:06:42 PM

రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి హితవు

మానకొండూర్ (విజయక్రాంతి): రైతులు పంట దిగుబడుల పైనే కాకుండా పండించిన ధాన్యంలో నాణ్యత పెంచడం పైన దృష్టి సారించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి, నల్లగొండ, మక్తపల్లి, పర్లపల్లి, అల్గునూరు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం అమ్మకానికి తీసుకు వచ్చిన ధాన్యాన్ని డిజిటల్ కాంటాలో తూకం వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిగుబడులు పెంచుకోవడం మంచిదేనని, అదే క్రమంలో పండించిన ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచుకోవడం అంతే ముఖ్యమన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి ముందే ధాన్యంలో తాలు, మట్టి పెళ్లలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యతను పట్టించుకోకుంటే నష్టపోవాల్సి వస్తుందని ఆయన రైతులకు గుర్తు చేశారు. నాణ్యత విషయంలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సన్న వడ్లలో దొడ్డు వడ్లు కలపడం మంచి పద్ధతి కాదన్నారు. సన్న రకం వరి పండించే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.500 రాయితీ ఇస్తోందన్నారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ అలువాల కోటి, పోరండ్ల సింగిల్ విండో డైరెక్టర్ గోపు మల్లారెడ్డి, పార్టీ నాయకులు గోగూరి నర్సింహారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, నోముల అనిల్, వీర చంద్రారెడ్డి, బుధారపు శ్రీనివాస్, ఎస్.కొండల్ రావు, జి.తిరుపతి, మార్క నర్సయ్య, పార్టీ నాయకులు జి.సంపత్ రెడ్డి, జ్యోతి, కొత్త శ్రీనివాస్, సింగం శ్రీనివాస్, కె.లక్ష్మినారాయణ రెడ్డి, పోలు రమేశ్, పోలు రాము, ఆసిఖ్ పాషా, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.