20-03-2025 06:56:52 PM
18 ఏండ్లు నిండిన వారు ఓటర్ జాబితాలో నమోదు అవకాశం..
సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు..
సంగారెడ్డి (విజయక్రాంతి): అర్హులైనవారు ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు కోరారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించేందుకు స్థానిక పార్టీల ప్రతినిధులు అవసరమైన సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కోరారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ నమోదు, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి సహకరించాలని కోరారు. ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలని, నూతనంగా ఓటరు నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాలను ఫామ్ 6,7,8 ద్వారా అందజేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, సంగారెడ్డి తహసిల్దార్ దేవదాస్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఆంథోని, ఎన్ పరశురాం నాయక్, బి ఆర్ ఎస్, షేక్ తాహెర్ పాషా ఐ ఎన్ సి. ఎన్ దేవయ్య కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపితో పాటు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.