calender_icon.png 23 October, 2024 | 1:47 PM

గురుకుల విద్యార్థినులకు విద్యుత్ షాక్

23-10-2024 01:36:00 AM

నలుగురికి గాయాలు

మెదక్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తగిలి నలుగురు విద్యార్థినులకు గాయాలైన ఘటన మెదక్ జిల్లా హవేళీఘణపూర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో జిల్లాస్థాయి గురుకుల క్రీడా పోటీలకు నిర్వహణకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం స్పోర్ట్స్ ఫ్లాగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇనుపరాడ్ విద్యుత్ తీగలకు తగిలింది.

ఇనుపరాడ్‌ను పట్టుకున్న విద్యార్థులు రజిత, వసంత, అనుష్క, గాయత్రికి విద్యుత్ షాక్ తగిలి చేతులకు గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మెదక్ ఆర్డీవో రమాదేవి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆసుపత్రిలో విద్యార్థినులను పరామర్శించారు.