22-03-2025 12:00:00 AM
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి
ముషీరాబాద్, మార్చి 21: (విజయక్రాంతి): ప్రజలందరికీ విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలువునిచ్చారు.
యుటిఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి (ఎవియస్) 24వ వర్ధంతి సందర్భంగా శుక్ర వారం దోమలగూడలోని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యుదయ ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించడానికి 16 సంవత్సరాల సర్వీసును త్యాగం చేసిన మహనీయుడు వెంకటస్వామి కొనియాడారు.
పాతికేళ్ళపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి సంఘాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దారని, తను నమ్మిన ఆదర్శాలను జీవితంలో ఆచరించిన గొప్ప దార్శనికుడు ఎవిఎస్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయడమే ఎవియస్కు అర్పించే ఘనమైన నివాళి అన్నారు. ఈ సమావేశంలో ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు ఎం సంయుక్త, రాష్ట్ర కార్యదర్శులు సింహాచలం, వెంకటప్ప, మాణిక్ రెడ్డి, కొండలరావు, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, నరహరి, హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.