calender_icon.png 21 September, 2024 | 5:19 PM

గర్భిణీ మహిళలకు వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలి...

21-09-2024 02:37:03 PM

గర్భిణీ మహిళలకు అందే వైద్య సేవల పై అధికారులతో రివ్యూ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో ఉన్న ప్రతి గర్భిణి మహిళకు సంపూర్ణమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులలో సమర్థవంతంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు. శనివారం  సమీకృత జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ గర్భిణీ మహిళలకు అందే వైద్య సేవల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ  జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణీల నమోదు తక్కువగా ఉందని, వారు పరిశీలించుకుని ప్రతి గర్భిణీ స్త్రీ 100% శాతం రిజిస్టర్ అయ్యేలా చూడాలని, గర్భిణీ స్త్రీలు నమోదు కొరకు ఎల్.ఎం.పి లిస్ట్, నవ దంపతుల లిస్ట్ ప్రిపేర్ చేసి వారిని ట్రాక్ చేయాలని,గర్భిణీ స్త్రీలను సూపర్ వైజర్ మానిటరింగ్ చేయాలని, బర్త్ ప్లాన్ రూపొందించుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, కనీసం 80 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరగాలన్నారు. 

జిల్లాలో అందుబాటులో ఉన్న 102 వాహనాలను ఉపయోగించుకొని గర్భిణీ స్త్రీలను పరీక్షలకు పంపాలని, ఏ రోజు ఏ గర్భిణి మహిళలను పరీక్షలకు తీసుకు రావాలో జాబితా తయారు చేసుకోవాలని, పెద్దపల్లిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన వారికి ప్రత్యేక ఏసీ రూములు (రూసుము చెల్లించే) ఉన్నాయని, అవసరమైన వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, సూపర్వైజర్లు కూడా మెడికల్ అధికారి సూచనలు పాటించాలని, ఫీవర్ సర్వేలో ఎక్కువ జ్వరాలు నమోదైన గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి సహకారంతో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, వైరల్ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఎడిపిహెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వాణిశ్రీ, సూపర్వైజర్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.