22-03-2025 11:18:21 PM
ఎన్ఐపీఈఆర్ డైరెక్టర్ సూర్యనారాయణ మూర్తి...
చేవెళ్ల: సమాజ అభివృద్ధిలో చదువే కీలకమని నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ (ఎన్ ఐపీఈఆర్) గౌహతి డైరెక్టర్ డాక్టర్ ఉపాధ్యాయ సూర్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. శనివారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్లో చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీలో నిర్వహించిన 13వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 14 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు గోల్ మెడల్స్ ఇవ్వడంతో పాటు 677 మందికి (83 మంది పీహెచ్డీ సహా) పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక, పరిశోధన రంగాలను ప్రోత్సహించడంలో యూనివర్సిటీ అగ్రగామిగా నిలుస్తోందని ప్రశంసించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, వ్యాధి ముందస్తు అంచనా, నమూనా గుర్తింపు లాంటి రంగాల్లో ఉన్న అవకాశాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఏపీ మాజీ మంత్రి ఎనుగల పెద్దిరెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు జ్ఞానం, నైతిక విలువలు పెంపొందించుకొని సమాజానికి సేవ చేయాలని సూచించారు. యూనివర్సిటీ పౌండర్, ఛాన్సలర్ డా. సీహెచ్ వీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నామని, ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో ఈ ఏడాది 784 మంది టాప్ కంపెనీల్లో ప్లేస్ మెంట్ పొందారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ రెడ్డి, డైరెక్టర్ , చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాత్విక రెడ్డి, వైస్ ఛాన్సలర్ శంకర్ లింగం, రిజిస్ట్రార్ రవీందర్, ఓఎస్ డీ వీర వెంకటయ్య, వివిధ విభాగాల డీన్స్ రాజు, కవిత, సుందర్ రామ్, క్రిస్టోపర్, విష్ణువర్ధన్, పవన్ కుమార్, ప్రత్యుష, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గాదె రాంబాబు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.