calender_icon.png 21 April, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ఎకో టౌన్

21-04-2025 01:16:04 AM

పర్యావరణ పరిరక్షణకు జపాన్ కంపెనీల సహకారం

ఈ మేరకు ఆ దేశ కంపెనీలతో తెలంగాణ కీలక ఒప్పందం

కిటాక్యూషూ మేయర్‌తో తెలంగాణ రైజింగ్ బృందం భేటీ

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పం దాలు కుదుర్చుకుంది. ఇందులో భాగం గా భాగ్యనగర్‌లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో ఆయా సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. నగర మేయర్ కజుహిసా టెక్యూచి సీఎం అక్కడి సంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. మేయర్ టాక్యూచితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అధికారులు భేటీ అయ్యారు.

పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర మోడల్స్, నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ 9 ఎల్‌ఎల్‌సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.

ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు కుదిరాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు నగరం, ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ వివరించారు.

తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకు నేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లా డుతూ.. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదు.. అవసరమని అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు  పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎకో టౌన్ అభివృద్ధి చేయటం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన పరిశుభ్ర మైన వాతావరణాన్ని అందించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అనుకూలం: ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అత్యం త అనుకూలమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రపంచ స్థా యి మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న శ్రామికశక్తితో పాటు తమ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, జపాన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని వెల్లడించారు.

హైదరాబాద్, కిటాక్యూషు నగరాల మధ్య విమాన ప్రయాణాన్ని ఏర్పాటు చేయాలనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జపాన్‌లో యువశక్తి అవసరం ఎక్కువగా ఉందని, మన యువతకు జపనీస్ భాషలోని నైపుణ్యాలను నేర్పితే, అంతర్జాతీయంగా ఉద్యోగావకాశాలు మెరుగవు తాయని చెప్పారు.

పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది. గతంలో కాలుష్య కాసారంగా ఉన్న ఈ నది, పరిశుభ్రమైన నదీతీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.