29-03-2025 06:30:57 PM
మణిపూర్,(విజయక్రాంతి): మణిపూర్ రాష్ట్రంలోని నోనీ జిల్లాలో శనివారం 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదిక లేదని అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.31 గంటలకు భూకంపం సంభవించిందని, ఆ ప్రదేశం ఈశాన్య రాష్ట్రంలోని నోనీ జిల్లాలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం లోతు 10 కి.మీ. అని, ఈశాన్య రాష్ట్రాలు అధిక భూకంప జోన్లో ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి.
ఇదిలా ఉండగా... మయన్మార్ లో మరోసారి భూకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 2.50 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. వరుస భూకంపాల వల్ల ఇప్పటి వరకు 1700 మందికి పైగా తీవ్రగాయాల పాలు కాగా, వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం 7.8 తీవ్రతతో తుర్కియే, సిరియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం మూలంగా దాదాపు 53వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే అని నిపుణులు చెబుతున్నారు. మయన్మార్, థాయ్లాండ్లో శుక్రవారం సంభవించిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.