01-04-2025 02:42:12 AM
నేటి నుంచి ఆస్తిపన్ను చెల్లించే వారికి 5శాతం మినహాయింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31(విజయక్రాంతి) : గ్రేటర్లోని ఆస్తి పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసం జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ స్కీంను తీసుకొచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ నోటీసు లేకుండా ఆస్తిపన్ను చెల్లించిన వారి కి ఈ స్కీం ద్వారా జీహెచ్ఎంసీ అధికారులు 5శాతం రిబేట్(మినహాయింపు) ఇవ్వనున్నారు.
మంగళవారం(ఏప్రిల్1) నుంచి ఈ నెల 30వరకు ఈ స్కీం అందుబాటులో ఉంటుందని జీహెచ్ఎంసీ కార్యా లయం పేర్కొంది. 2025-26ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నుకు మాత్రమే ఎర్లీబర్డ్ వర్తిస్తుందని, అంతకు ముందు పేరుకుపోయిన బకాయిలకు వర్తించదని అధికారులు పేర్కొన్నారు.
కాగా జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన మొండి బకాయిల వసూలు కోసం మార్చి 1 నుంచి 31 వరకు ఓటీఎస్ అవకాశం కల్పించింది. దీంతో పేరుకు పోయిన బకాయిలపై 90శాతం వడ్డీ మినహాయింపును ఇచ్చి జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను బకాయిను రాబట్టుకుంది. ఓటీఎస్ పథకం కింద ఆస్తి పన్ను బకాయిలు దాదాపు రూ.465.07కోట్లు వసూలయినట్లు తెలుస్తోంది.