25-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ రాకముందే ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ సీడబ్ల్యూసీ మెంబర్ చింతకాయల ఝాన్సీ, గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి పృథ్వీతేజ డిమాండ్ చేశారు. గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
అంత కు ముందు నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి ఇంట ర్ బోర్డు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ, పృథ్వీతేజ మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా ఇంటర్ అడ్మిషన్లను నిర్వహించాలని కోరారు. పదో తరగతి ఫలితాలు రాకముందే, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్ల పేరిట రూ.లక్షలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఒకే బ్రాంచి అనుమతితో అనేక బ్రాంచ్లను నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్, కళ్యాణి, హరిప్రసాద్, అక్షిత, జిల్లా నాయకులు సూర్యప్రకాశ్, శ్యామ్, విక్రమ్, ఉదయ్, నగేష్, చందు, శివ, గోపాల్, అఖిల్ పాల్గొన్నారు.