calender_icon.png 9 February, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్‌లో మళ్లీ డస్ట్‌బిన్స్

09-02-2025 12:47:35 AM

  • ఈసారి ప్రయోగాత్మకంగా సెన్సార్ డస్ట్‌బిన్స్ 

మలక్‌పేట్ సర్కిల్‌లో 12 చోట్ల ఏర్పాటు 

చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి ౮ (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు, చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు 4 ఏళ్లుగా జీహెచ్‌ఎం సీ చేపట్టిన కృషి ఫలించలేదు. గ్రేటర్‌లో దాదాపు 1200 లకు పైగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నట్టుగా బల్దియానే అధికారికంగా గుర్తించింది.

గ్రేటర్‌లో కొన్నాళ్లుగా చెత్త కుప్పలు ఎక్కడి పడితే అక్కడ దర్శనం ఇవ్వడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీకి కమిషనర్లు మారుతున్నా నగరంలోని చెత్త సమస్య తీరకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గ్రేటర్‌లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా ప్రస్తుత కమిషనర్ ఇలంబర్తి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.

గతానికంటే భిన్నంగా డస్ట్‌బిన్స్‌కు సెన్సార్ ఏర్పాటు చేసి బిన్ నిండగానే తొలగించేలా ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మలక్‌పేట్ సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా 12 సెన్సార్ డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. సెన్సార్ డస్ట్‌బిన్‌లను గ్రేటర్ వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. 

గ్రేటర్‌లో నిరంతర సమస్యగా

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజూ 7 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందుకు రాంకీ సంస్థకు జీహెచ్‌ఎంసీ కోట్లాది రూపాయలు చెల్లిస్తుంది. గ్రేటర్‌లో దాదాపు 4500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త నిల్వల సేకరణ జరుగుతుంటుంది.గ్రేటర్‌లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది.

దీంతో నగరంలో ఎక్కడ చూసినా చెత్త నిల్వలు కన్పిస్తున్నాయి. గ్రేటర్‌లో 150 డివిజన్ల వ్యాప్తంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ (జీవీపీ) ఉన్నటు జీహెచ్‌ఎంసీ అధికారికంగా పేర్కొంది. దీంతో గ్రేటర్ లో చెత్త నిల్వలు లేకుండా చేయడమనేది బల్దియాకు సవాల్‌గా మారుతోంది. 

కొత్తగా సెన్సార్ డస్ట్‌బిన్స్.. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా, నగరాన్ని చెత్త రహితంగా తయారు చేసేందుకు నాలుగేళ్ల క్రితం అప్పటికే ఉన్న డస్ట్‌బిన్లను తొలగించారు. ఇంటింటికి డస్ట్‌బిన్‌లను అందజేశారు. ఇంట్లోనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని సూచించారు. ఈ ప్రయోగాలేవీ సక్సెస్ కాలేదు.

స్వచ్ఛ భారత్ అవార్డుల కోసం మాత్రమే నగరంలో రహదారులు, కూడళ్లలో చెత్త నిల్వలు తొలగించి అందంగా ఉంచుతున్నారే తప్ప స్వచ్ఛ అవార్డులు గెల్చుకున్న తర్వాత నగరంలో చెత్త సమస్యను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కమిషనర్ బాధ్యతలు తీసుకున్న ఇలంబర్తి మరోసారి పారిశుద్ద్య నిర్వహణపై ఫోకస్ పెట్టారు.

మళ్లీ డస్ట్ బిన్స్ తీసుకురావాలనే ఆలోచనకు వచ్చారు. అయితే ఈ సారి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సెన్సార్‌తో కూడిన డస్ట్‌బిన్స్‌ను నగరంలో ఏర్పాటు చేస్తున్నారు.

అయితే డస్ట్ బిన్ నిండగానే సమీపంలో ఉండే కంటైనర్‌కు అలారం ద్వారా సిగ్నల్ అందుకోవడంతో చెత్త నిల్వలతో నిండిన డస్ట్ బిన్‌ను తొలగించేలా సాంకేతిక విధానాన్ని అమలు చేయబోతున్నారు.

గ్రేటర్‌లో 1000 డస్ట్ బిన్స్‌తో ప్రయోగం చేయాలని భావించగా ప్రస్తుతం మలక్‌పేట్ సర్కిల్ ఓల్డ్ మలక్‌పేట్‌లో 12 డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే గ్రేటర్ వ్యాప్తంగా సెన్సార్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేయనున్నారు.