05-03-2025 01:12:39 AM
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నల్లగొండ, మార్చి 4 (విజయక్రాంతి) : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, ఆర్డబ్ల్యూఎస్ , మిషన్ భగీరథ, నీటిపారుదల, విద్యుత్, మున్సిపల్ అధికారులతో మంగళవారం ఆయన తాగునీరు, విద్యుత్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు.
రానున్న వేసవిలో నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి, కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇండియా, అంబుజా సిమెంట్ (పెన్నా) యాజమాన్యంతో సమావేశమయ్యారు.
పరిశ్రమల పరిసరాల గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని కోరారు. మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ ఫండ్ అందజేయాలని చెప్పారు. వాడపల్లి, ఇర్కిగూడెం, గణేశ్ పహాడ్, శూన్యపహాడ్ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి వాడపల్లిలోని మిషన్ భగీరథ ప్లాంట్ను ఆయన పరిశీలించారు.