బుద్ధ నగర్ లో త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలి
ఫీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ బుద్దానగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, స్థానికులతో కలిసి కాలనీల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సమర్థవంతమైన తాగునీటి సరఫరా జరిగేదని,
కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పలుచోట్ల రోజుల తరబడి నీటి సరఫరా లేక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతు, నీటి సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ప్రతి కాలనీలో ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.






