18-02-2025 11:18:20 PM
ఎక్స్ అధినేత మస్క్ ఆసక్తికర పోస్ట్..
న్యూయార్క్: అమెరికాలో వంద ఏళ్లకు పైబడిన చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ బతికే ఉన్నారంటూ సోషల్ సెక్యూరిటీ డేటా విభాగం పేర్కొంది. డేటా ప్రకారం అందులో 360 ఏళ్లకు పైబడిన ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడని డోజ్ అధినేత ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘ సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ ప్రకారం వందేళ్లకు పైబడిన వ్యక్తులు చాలా మంది సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం వీరంతా మరణించారనడం అవాస్తవమనిపిస్తోంది.
సోషల్ సెక్యూరిటీలో చాలా మంది తమ పేర్లు నమోదు చేసుకోకపోవడం వల్ల డేటాబేస్లో పూర్తి వివరాలు లభ్యం కావడం లేదు’ అని మస్క్ వెల్లడించారు. వందేళ్లు దాటిన దాదాపు రెండు కోట్ల మంది ఇప్పటికీ సోషల్ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 220 ఏళ్ల వయసు మధ్య 1039 మంది సజీవంగా ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం. అమెరికా జనాభా లెక్కల ప్రకారం వందేళ్లు దాటిన వృద్ధుల సంఖ్య 86వేలుగా ఉంది. సోషల్ సెక్యూరిటీ సంస్థ రిటైరయిన వారికి, వైకల్యంతో బాధపడేవారికి ఆదాయ మార్గాలను సమకూరుస్తోంది.