calender_icon.png 21 October, 2024 | 4:23 PM

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల రచ్చ..

21-10-2024 01:30:25 PM

కేటాయించిన ఇండ్లు అప్పగించాలన్న లబ్ధిదారులు

సర్వే పూర్తయ్యాక ఇస్తామన్న ఆర్డీవో.. 

గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల గొడవ మరోసారి రచ్చకెక్కింది. తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తమకు అప్పగించాలంటూ లబ్ధిదారులు సోమవారం ఆర్డిఓ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంటన్నర పాటు లబ్ధిదారుల నిరసన కొనసాగగా కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యాలయం బయట లబ్ధిదారులు ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఆర్డిఓ బన్సీలాల్ లబ్ధిదారులతో మాట్లాడారు. మున్సిపాలిటీలోని పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్నారని, ప్యాకేజీ అందిన, అందని వారి వివరాల సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వే పూర్తికాగానే మిగిలిన లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించడంతో పాటు పట్టాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. ఆర్డీవో సమాధానంతో తృప్తి చెందని లబ్ధిదారులు చాలాసేపటి వరకు తమకు న్యాయం జరగాలంటూ ఆర్డిఓ కార్యాలయం వద్దే నిరీక్షించారు.