calender_icon.png 23 October, 2024 | 2:59 PM

ఆందోళన వద్దు అండగా ఉంటాం..

23-10-2024 12:23:35 PM

అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్..

బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోర్టులో మూసి బాధితులకు పరామర్శ

రాజేంద్రనగర్, (విజయక్రాంతి): మూసి బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బిజెపి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉండి పోరాటం చేస్తామని అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోర్టులోని మూసి పరివాహక ప్రాంతమైన శివపురి కాలనీ తదితర ప్రాంతాల్లో రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మూసి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రకృతిని నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని విధాలుగా అండగా ఉండి తోడుగా నిలుస్తామని బిజెపి నాయకులు బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకుండా డ్రామాలు ఆడుతుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. మూసి అభివృద్ధితో ఎవరికి ఉపయోగమని ఆయన ప్రశ్నించారు. బాధితుల ఇల్లు కూల్చివేసి మూసిని సుందరీకరిస్తామంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. బాధితులకు అండగా పోరాటం చేస్తామని, పక్కాగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేతలు వై శ్రీధర్ కొమురయ్య, భీమార్జున్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.