అడ్డుకున్న ఇంటి యజమాని
ఊరి బయట డేరాలో భర్త డెడ్బాడీని ఉంచిన భార్య
హుజూరాబాద్, సెప్టెంబర్ 25: తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి మృతిచెందగా.. ఆ వ్యక్తి మృతదేహాన్ని ఇంటి ముందు వేయకుండా యజమాని అడ్డుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
ధర్మరాజుపల్లి గ్రామంలో కోట లక్ష్మణ్, ప్రేమలత దంపతులు అదే గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. కూలీ చేస్తూనే ఇద్దరు కూతుళ్లకు ఉన్నంతలో వివాహం జరిపించారు. మంగళవారం అకస్మాత్తుగా లక్ష్మణ్ కింద పడిపోగా గ్రామస్థుల సహాయంతో ప్రేమలత ఎంజీఎంకు తీసుకెళ్లింది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో లక్ష్మణ్ మృతి చెందాడు.
మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకువస్తుండగా యజమాని అడ్డుకున్నాడు. దీంతో ఊరి బయట చిన్న డేరా వేసి మృతదేహాన్ని ఉంచారు. లక్ష్మణ్ మృతదేహాన్ని చూసేందుకు వస్తున్న వారిని ప్రేమలత చేయిచాచి అంత్యక్రియలకు సాయం చేయాలని వేడుకున్నది. గ్రామస్థులు కొంత సాయం చేయగా.. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ రూ.5 వేలు ఇచ్చారు.