17-03-2025 01:11:12 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు, ధర్నాలను నిషేధిస్తూ ఈ నెల 13న వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. నరేశ్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సర్క్యులర్ను విద్యా ర్థి, అధ్యాపక సంఘాలు వేర్వేరుగా ముక్తకంఠంతో ఖండించాయి.
ఓయూలో విద్యార్థుల ఆందోళనలను నిషేధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా ఆదివారం సర్క్యులర్ను వ్యతిరేకిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓయూ విద్యార్థుల రాజ్యాంగ హక్కులను అణచివేసేందుకు వీసీ ప్రొ.కుమార్ నియంతృత్వ మార్గాలను ఎంచుకున్నాడని విమర్శించారు. సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీసీ తన ఐదు నెలల పాలనలో ఒక్క సమస్యపై కూడా విద్యార్థి సంఘాలతో మాట్లాడలేదని ఆరోపించారు.
ఓయూ అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించి, వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని విద్యార్థి సంఘాలు కోరుతుంటూ దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వీసీలతో అణచివేత చర్యలకు దిగుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి, స్పష్టత ఇవ్వాలన్నారు. లేదంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించా రు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఎదు ట సర్క్యులర్ కాపీలను దహనం చేశారు.
ఆందోళనలు సరికాదు: రిజిస్ట్రార్
ఓయూ నిర్ణయాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదని ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.నరేష్రెడ్డి అన్నారు. ఓయూ పరిపాలన భవనం, అధికారుల ఛాంబర్లలోకి వెళ్లి ధర్నా లు, ఆందోళనలు నిర్వహించడం మాత్రమే సరికాదనేది తమ సర్క్యులర్ ఉద్దేశమన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యో గులు సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలని సూచించారు.
ఇటీవల నిజాంకాలేజీ ప్రిన్సిపాల్ ఛాంబర్లోకి విద్యార్థులు చొచ్చుకెళ్లడం, ఆర్ట్స్ కాలేఈ ప్రిన్సిపాల్, ఓయూ రిజిస్ట్రార్, వీసీ ఛాంబర్లలో రాత్రంతా దిగ్భందించడం పాలనకు తీవ్ర అంతరాయాన్ని కల్పించాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గుణం ఓయూ విద్యార్థులదని, వారి సమస్యలపై స్పందించేందుకు ఓయూ యంత్రాం గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.