12-04-2025 12:17:09 AM
తెలంగాణ ప్రభుత్వానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాష గా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు వచ్చిన వార్తలు విని చాలా బాధవేసిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక మార్కుల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు. అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చు కొనే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది.
అందుకే జాతీయ విద్యావిధానం-2020 సైతం మాతృభాషకే ప్రాధాన్యమిచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకొని, విద్యా ర్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని వెంకయ్యనా యుడు పేర్కొన్నారు.