- అంగన్వాడీలకు నాణ్యమైన పోషకాహారం అందాలి
- తెలంగాణ ఫుడ్స్పై మంత్రి సీతక్క సమీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పోషకాహా రం అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆహారం తయారీ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు చేరేదాకా పటిష్ఠ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు.
మంగళవారం సచివాలయంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ నుంచి అంగన్వాడీలకు సరఫరా అవుతున్న ఆహార వస్తువుల నాణ్యతపై సమీక్షించారు. అంగన్వాడీలకు ఆలస్యంగా సరఫరా చేసే ట్రాన్స్పోర్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంగన్వాడీలకు సరఫరా అయ్యే ఆయిల్, పప్పులు, బాలామృతం, ఆహార పదార్థాల్లో నాణ్యతపై రాజీ పడొద్దని చెప్పారు. ఎదిగే వయసులో చిన్నారులకు మంచి పోషకాలను అందిస్తేనే దేశం దృఢంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఫుడ్స్లో వినియోగిస్తున్న రా మెటీరియల్ ధరలను గత పదేళ్లుగా సవరించని నేపథ్యంలో సవరణ కోసం ఫైనాన్స్, మహిళా శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ఫుడ్స్ అధికారులతో త్రీమెన్ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు.
నివేదిక ఆధారంగా ధరల సవరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించా రు. అంగన్వాడీలకు అవసరమైన సరుకులు స్థానిక లభ్యతపై అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు.