calender_icon.png 7 February, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాధాకిషన్‌రావును అరెస్ట్ చేయొద్దు

07-02-2025 02:00:27 AM

ఫోన్‌ట్యాపింగ్ కేసులో హైకోర్టు

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడైన రాధాకిషన్‌రావు అరెస్ట్‌పై హైకోర్టు గురువారం స్టే మంజూరు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన బీఆర్‌ఎస్‌కు చెందిన సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావును అరెస్ట్ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో రాధాకిషన్‌రావు అరెస్ట్‌పై  స్టే ఇచ్చింది.

ఇందులో ఫిర్యాదుదారు అయిన చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీ చేసింది. చక్రధర్‌గౌడ్‌తో పాటు పోలీసులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు హరీశ్‌రావుతోపాటు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేసులో ఏ 2 గా ఉన్న రాధాకిషన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితమే.

దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఫిర్యాదులో పేర్కొన్న అంశంలో గతంలో మరో కేసులో ఫిర్యాదుదారు ఇచ్చిన వాంగ్మూలంలోనే పేర్కొన్నారన్నారు.

పీపీ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటికే ఏడుగురి వాంగ్ములాలు నమోదు చేశామన్నారు. దీంతో ఈ వాంగ్మూలాలు సమర్పించాలని, అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.