19-04-2025 12:08:18 AM
అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరె అరవింద్రెడ్డి
ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : భూదాన భూములను నిరు పేదలకు పంచాలని అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షులు వెదిరె అరవింద్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూదాన భూదాత వెదిరె రామచం ద్రారెడ్డి కొడుకు వెదిరె ప్రోమోతిష్ చంద్ర రెడ్డి, అఖిల భారత సర్వసేవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తొలుపునురి కృష్ణ గౌడ్ లతో కలసి ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆధ్యాత్మిక వారసుడు ఆచార్య వినోబా భవే చేపట్టిన స్వరాజ్యం, సర్వోదయ ఉద్యమాలలో భాగంగా భూమిలేని గ్రామీణ నిరుపేదలను సాధికారతను తీసుకరావడంకోసం ఏప్రిల్ 18, 1951లో పోచంపల్లిలో భూదాన ఉద్యమం ప్రారంభించబడి దేశ వ్యాప్తంగా విస్తరించి 75 ఏళ్లు పూర్తయిన సందర్బంగా దేశ వ్యాప్తంగా సంవత్సరం పాటు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
శుక్రవారం మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో భూదాన ఉద్యమం వజ్రోత్సవాలను ప్రారంభిస్తున్నామని, అనంతరం ఏడాది పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లాలో జరుగుతాయని, జులై 17న హైదరాబాద్ లో లక్ష మందితో ఈ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. తక్షణమే తెలంగాణ భూదాన యజ్ఞ బోర్డును ఏర్పా టు చేయాలన్నారు. భూదాన భూము లు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. భూదాన భూములు కబ్జాకోరులపై కఠిన చెర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు భూ అక్రమార్కులు వెదిరె రామచంద్ర రెడ్డి కుటంబ సభ్యుల పేర్లు చెప్పి భూదాన భూములు అమ్ముకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారిపై న్యాయపరమైన చెర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.