గజ్వేల్ (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్ అన్నారు. జిల్లా ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వ్యక్తులకు రక్తం చాలా అవసరమని అత్యవసరంగా రక్తం ఎక్కించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు.
రక్తదానము ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయవచ్చన్నారు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్త కణాలు కూడా ఉత్పత్తి అయ్యి దాతలకు మరింత ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భవాని, పాతాలోజిస్ట్, డాక్టర్ నవ్య, నర్సింగ్ సూపరిండెంట్ సువర్ణ స్వరూప రాణి, హెడ్ నర్స్ హెల్త్ అసిస్టెంట్ డి. వాసుదేవ్, బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్స్ ప్రణీత్, సిద్దిపేట బ్లడ్ బ్యాంక్ సాగర్, శివ, దేవేందర్ పాల్గొన్నారు. కాగా ఈ రక్తదాన శిబిరంలో 22 మంది దాతలు రక్తదానం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు ఏ. మల్లేశం గౌడ్ మరియు ట్రెజరర్ దొంతుల సత్యనారాయణలు రక్తదాతలకు ఫ్రూట్ జ్యూస్, పండ్లు పంపిణీ చేశారు.