25-02-2025 01:30:16 AM
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్నగర్, ఫిబ్రవరి 24: సిర్పూర్ నియోజకవర్గంలో రహదారులు, వంతెనల వద్ద వరుస ప్రమాదాలు జరుగుతూ సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పట్టించుకునే నాధుడే లేడని బి ఆర్ ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.కాగజ్ నగర్ మండలం ఈస్గాం మూల మలుపు వద్దగల ఇరుకు వంతెన వద్ద బాధిత కుటుంబాలతో కలిసి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
అరెస్పీ మాట్లాడుతూ.. ఇదే వంతెన వద్ద ఎన్నో ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యే గా పని చేసిన కోనేరు కోనప్ప, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ బాబు ఇరుకు వంతెనను మాత్రం పట్టించుకోలేదని అన్నారు.
సిర్పూర్ నియోజకవర్గంలో ఇలాంటి వంతెనలు చాలా ఉన్నాయని, రహదారులు సైతం గుంతలమయంగా ఉన్నాయని అన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం సిర్పూర్లో అభివృద్ధి ఎక్కడ చేశారో చూపాలని సవాల్ విసిరారు. నెల రోజుల్లో ఇరుకు వంతెనలు మార్చి నూతన నిర్మాణాలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.