calender_icon.png 19 October, 2024 | 3:13 PM

మూసీ నీళ్లతో స్నానం చేస్తారా..

19-10-2024 02:30:42 AM

ఎంపీ ఈటలకు కాంగ్రెస్ ఎంపీ చామల సవాల్

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మూసీ ప్రక్షాళన వద్దంటున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అదే నీళ్లతో స్నానం చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు మురికి వాసన రాకుంటే ప్రక్షాళన అవసరం లేదని చామల అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈటల బీజేపీలోకి పోయి కలుషితం అయ్యాడని విమర్శించారు.

పాతబాస్‌లు కేసీఆర్, కేటీఆర్‌లను ఈటల అనుసరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తా అన్నాడని గుర్తు చేశారు. లక్షన్నర కోట్లు అనే పదాన్ని పట్టుకుని రోజూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు. పేదలు మురికి కూపంలోనే బతకాలా అని ప్రశ్నించారు. భువనగిరి ప్రజలకు మూసీ నది జీవ నది అని తెలిపారు. మూసీని వ్యతిరేకించే నాయకులను రోడ్ల మీద తిరగనివ్వబోమని హెచ్చరంచారు.