calender_icon.png 9 October, 2024 | 3:55 AM

వర్షం నీరు వృథా కావొద్దు

09-10-2024 01:40:45 AM

ప్రతి ఇంటికి ఇంకుడుగుంత ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి 

మంత్రి పొన్నం ప్రభాకర్

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అధికారులతో సమావేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8(విజయక్రాంతి): నగరంలో వర్షం నీరు వృథా కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రవా ణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్య దర్శి దానకిశోర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్‌రెడ్డి, కమిషనర్ ఆమ్రపా లి, కలెక్టర్ అనుదీప్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షం నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు నగరం లో ఎక్కువ మొత్తంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంజెక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

వర్షం నీరు నిలిచే ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత తప్పనిసరిగా ఉండేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. నగర ప్రజలు వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా, వర్షపు నీటిని ఆదా చేసుకోవాలని తెలిపారు. 

నీరు నిల్వకుండా చర్యలు 

గ్రేటర్‌లోని 141వాటర్ లాగింగ్ పాయిం ట్ల వద్ద నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఆమ్రపాలి కాట అన్నా రు. లాగింగ్ పాయింట్ల వద్ద నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నీరు నిల్వకుండా పనులు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. 

ప్రజలను చైతన్యపరిచేలా స్పెషల్ డ్రైవ్

జీహెచ్‌ఎంసీలోని 150 వార్డుల కార్పొరేటర్లను ఇంకుడు గుంతల నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి అన్నా రు. జాయింట్, డిప్యూటీ కమిషనర్లను సమన్వయం చేసుకొని ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు.