సీఎంఆర్లో రూ.240 కోట్ల అవినీతిపై కలెక్టర్ సీరియస్
జిల్లాలోని 66 మిల్లులను బ్లాక్లిస్టులో పెట్టిన అధికారులు
నిబంధనలు పాటించాల్సిందేనని హుకుం
మెదక్, అక్టోబర్ 1(విజయక్రాంతి): ‘సీఎంఅర్లో అవినీతి జలగలు’ అని సోమవారం విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనానికి మెదక్ జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులు స్పందించారు. జిల్లా పరిధిలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పక్కదారి పట్టించిన 66 రైస్మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టారు.
దీంతో ఈ సీజన్లో జిల్లాలో 109 రైస్మిల్లులకు గాను 43 మిల్లులకు మాత్రమే లక్షా 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మిగితా 2 లక్షల 54 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. సీఎంఆర్ రికవరీ అయ్యేంతవరకు సదరు రైస్మిల్లులకు ధాన్యం తరలించేది లేదని మంగళవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.