calender_icon.png 10 March, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో అక్రమ లేఔట్లను ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయవద్దు

10-03-2025 12:14:02 PM

మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు, ఓపెన్ స్పెస్ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ

ఎల్ఆర్ఎస్  పై సంబంధిత అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, (విజయక్రాంతి): ఎల్.ఆర్.ఎస్ కాకుండా అక్రమ లేఅవుట్ లలోని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Collector Koya Sri Harsha) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం  జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ఎల్ఆర్ఎస్ పై  అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ తో  కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లే ఔట్ క్రమబద్ధీకరణ 2020 పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి ఫీజు తో  పాటు  ఓపెన్ స్పెస్ చార్జి లను మార్చి 31 లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుందన్నారు. 

ఆగస్టు 26, 2020 వరకు 10 శాతం ప్లాట్లు విక్రయించిన లే ఔట్ లను క్రమబద్ధికరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, సబ్ రిజిస్టర్  ద్వారా 10శాతం ప్లాట్లు విక్రయించిన లే ఔట్ లు ఎల్ఆర్ఎస్(LRS ) కోసం నూతన దరఖాస్తు సమర్పించవచ్చని, క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించడం ఉండదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమ బద్దీకరణ చేసుకోవాలని, మార్చి 31 వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలని తెలిపారు. క్రమబద్ధీకరణ చేయని అక్రమ లే ఔట్ లలోని ప్లాట్ లను ఎట్టి పరిస్థితులలో రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 

నిషేధిత జాబితాలో లేని, బఫర్, ఎఫ్.టి.ఎల్, చెరువులు కుంటలు తదితర ప్రాంతాలలో లేని ప్లాట్ల కు ఆటోమేటిక్ గా ఎల్ఆర్ఎస్ కు అనుమతి లభిస్తుందని, చెరువులు నీటి వనరులు తదితర ప్రాంతాలకు 200  మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు మాత్రం  రెవెన్యూ నీటిపారుదల శాఖ అనుమతులు తప్పనిసరిగా చేయాలని, ఎల్ఆర్ఎస్ అర్హత లేని స్థలాలపై చెల్లించిన ఫీజులు 90% రిఫండ్ అవుతుందని, 10 శాతం ప్రాసెసింగ్ కోసం తీసుకుంటామని, స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని,  ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించిన వారికి  అర్హత ఉంటే స్థల క్రమబద్ధీకరణ చేసి సంబంధిత  ప్రొసీడింగ్స్ జారీ చేయాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు గంగయ్య, సురేష్, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్, తహసిల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.